ముంబై, జూన్ 19 : వీడియోకాన్ గ్రూపునకు రుణాల మంజూరు విషయంలో క్విడ్-ప్రో-కో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్... ఈ అంశంపై బ్యాంకు స్వతంత్రంగా చేపట్టిన విచారణ పూర్తయ్యే వరకు సెలవుపైనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా పనిచేస్తున్న సందీప్ భక్షి ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా రంగ ప్రవేశం చేయనున్నారు. ఆయన్ను సీవోవోగా ఎంపిక చేస్తూ సోమవారం సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 19నే (మంగళవారం) సీవోవోగా సందీప్ భక్షి బాధ్యతలు చేపడతారని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకం వివిధ అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. 'ఐసీఐసీఐ బ్యాంకు అన్ని వ్యాపారాలను భక్షి పర్యవేక్షించనున్నారు. అలాగే, బ్యాంకు కార్పొరేట్ కార్యకలాపాలను కూడా ఆయనే చూస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సైతం ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది' అని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది.