హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సావిత్రి బయోపిక్ మహానటిగా మన ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్లు తెరకెక్కుతున్నాయి. వైయస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’గా తెరకెక్కుతుంది. దీనిలో మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు (కధానాయకుడు, మహానాయకుడు)గా రూపొందుతోంది. ‘ఎన్టీఆర్’లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ రెండు చిత్రాల గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. మొదట 'ఎన్టీఆర్’కు పోటీగా ‘యాత్ర’ సినిమాను ‘జనవరిలోనే విడుదల చేయాలని భావించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 8కి మార్చారట. ‘ఎన్టీఆర్’ జనవరిలో విడుదల కానుండగా.. ‘యాత్ర’ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే పరిస్థితి ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.