భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖని అభినందించిన సీఎం జగన్

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 09:53 PM

భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖని అభినందించిన సీఎం జగన్

జూన్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌‌లో కాంస్య పతకం గెలుపొందిన భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకున్న ఈ విజయవాడ విలువిద్య క్రీడాకారిణి.. భారత టీమ్‌ కాంస్యం గెలవడంలోనూ క్రియాశీలక పాత్ర పోషించింది. టోర్నీ చరిత్రలో.. అదీ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్ కాంస్యం గెలవడం ఇదే తొలిసారి. దీంతో.. 22 ఏళ్ల జ్యోతి సురేఖని శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభినందించి.. సన్మానించారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా జ్యోతి సురేఖ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ పోటీల్లో 32 పతకాలు సాధించాను. ఇందులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని బంగారు పతకాలు సాధిస్తా’ అని ధీమా వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీ సీఎం కార్యాలయం ఓ అధికారిక ప్రకటనని విడుదల చేసింది. ఇందులో జ్యోతి సురేఖకి అభినందనలు తెలిపిన సీఎం వైఎస్ జగన్.. సురేఖ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక పోరులో టర్కీ ఆర్చర్ బోస్టన్‌తో పోటీపడిన సురేఖ.. షూటాఫ్ 10-9 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక భారత్ టీమ్‌తో కలిసి పోటీపడిన సమయంలో ఈ తెలుగు షట్లర్ అసాధారణ ప్రదర్శనని కనబర్చింది. ఎంతలా అంటే..? మొత్తం 8 అవకాశాల్లో ఏకంగా ఆరుసార్లు పది పాయింట్లు సాధించింది. దీంతో.. 229-226 తేడాతో టర్కీపై భారత్ నెగ్గి కాంస్యం కైవసం చేసుకుంది.





Untitled Document
Advertisements