నాగదోషం ఉందని పసికందు గొంతు కోసిన తల్లి

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 03:32 PM

నాగదోషం ఉందని పసికందు గొంతు కోసిన తల్లి

మూఢనమ్మకం ముక్కు పచ్చలారని ఓ చిన్నారి ప్రాణం తీసింది. పూజల పేరుతో ఆరు నెలల బిడ్డను కన్నతల్లే దేవుడి సాక్షిగా గొంతు కోసి హతమార్చిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో గురువారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోత్‌ భారతికి ఎనిమిదేళ్ల కిందట మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయినా కొద్దిరోజులకే విడిపోయారు. అనంతరం పుట్టింటికి వచ్చేసిన భారతి అదే తండాకు చెందిన కృష్ణను ప్రేమించింది. మొదట వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పెద్దమనుషులు దగ్గరుండి రెండేళ్ల క్రితం వారి పెళ్లి చేశారు.

ఆరు నెలల కిందట వారికి ఓ కూతురు పుట్టింది. భారతి రోజూ యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ.. తనను తాను శివుడిగా భావిస్తూ వింతగా ప్రవర్తిస్తుండేది. ఇటీవల గ్రామానికి వచ్చిన ఓ సాధువు ఆమెకు నాగదోషం ఉందని చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారింది. భర్త, బిడ్డను కూడా సరిగ్గా పట్టించుకోకుండా నిత్యం పూజలతోనే గడిపేది. ఈ నేపథ్యంలోనే గురువారం భర్త కృష్ణ పని మీద సూర్యాపేటకు వెళ్లగా.. అత్తమామలు పొలం పనులకు వెళ్లారు.

ఆ సమయంలో భారతి తన కూతురు రీతును (6 నెలలు) దేవుడి పటం ముందు పడుకోబెట్టి కత్తితో గొంతు కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ పసికందు అక్కడికక్కడే మరణించింది. తర్వాత భారతి అదే తండాలోని తన పుట్టింటికి వెళ్లగా బిడ్డ ఎక్కడని తల్లిదండ్రులు నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో వారు ఇంటికి వెళ్లి చూడగా పాప రక్తపు మడుగులో కనిపించింది. ఈ విషయం బయటికి పొక్కడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీఎస్సీ బీఈడీ చదివిన భారతి ఐదేళ్ల కిందట ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సన్నద్ధమైనట్లు స్థానికులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించినట్లు చెబుతున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.





Untitled Document
Advertisements