ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఇంగ్లాండ్ యువ ఆటగాడు శామ్ కరన్.. వేలం ముగిసిన తరువాత తన ఫీలింగ్ ని మాటలలో వ్యక్త పరిచాడు. రికార్డు స్థాయి ధర పలకడం ఆనందంగా ఉందని వెల్లడించాడు. నిజానికి అతను ఈ వేలానికి ముందురోజు ఐపీఎల్ మినీ వేలం ఎలా జరుగుతుందోననే టెన్షన్ తో నిద్ర పోలేదని వేలం జరగడానికి ముందు కొంత నెర్వస్ గా అనిపించిందని వివరించాడు. అయితే, తనకోసం ఫ్రాంచైజీలు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తాయని ఊహించలేదని కరన్ చెప్పాడు.
శుక్రవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో శామ్ కరన్ ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ధరను పెంచాయి. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఈ ఆల్ రౌండర్ కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో పాటు పంజాబ్ కింగ్స్ వేలంలో పోటీ పడ్డాయి.
చివరకు రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు శామ్ కరన్ ను దక్కించుకుంది. కాగా, 2019లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కరన్.. ఆ సీజన్ లో పంజాబ్ జట్టుకే ఆడడం విశేషం. ఇప్పుడు తొలిసారి తాను ఆడిన జట్టుకే మరోసారి ఆడే అవకాశం లభించడం సంతోషంగా ఉంది అన్నాడు.