న్యూయార్క్ నగరంలో కాల్పుల కలకలం

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 09:02 AM

న్యూయార్క్ నగరంలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో ఓ మహిళ కూడా 5 ఏళ్ల చిన్నపిల్లాడిని వెంట పెట్టుకుని మరి చర్చిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే మరో కాల్పుల ఘటన నమోదయింది. న్యూయార్క్ నగరం బ్రోంక్స్‌లోని సబ్‌వే స్టేషన్‌లో ఓ దుండగుడు పలువురిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురికి బుల్లెట్ గాయాలవ్వగా ఒకరు మృత్యువాతపడ్డారని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. మిగతా ఐదుగురు బాధితులకు ప్రాణాపాయంలేదని తెలిపాయి. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్ సిటీ పోలీసులు మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఎంతమందిపై కాల్పులు జరిగాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడ్డ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అనేది తెలియరాలేదు.

కాగా న్యూయార్క్‌ నగరంలోని సబ్‌వే సిస్టమ్‌‌లో చోటు చేసుకుంటున్న నేరాలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. 2023లో వేర్వేరు 570 నేరపూరిత ఘటనలు జరిగినట్టు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ రిపోర్ట్ పేర్కొంది. 2022లో బ్రూక్లిన్ నుంచి వెళుతున్న రైలులో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి 10 మంది ప్రయాణికులను గాయపరిచాడు. ఆ తర్వాత కొన్ని వారాలకే మే 2022లో ఒక వ్యక్తి రైలులో కాల్పులు జరిపాడు. వరుసగా జరుగుతున్న ఘటనలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.





Untitled Document
Advertisements