కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలనకు ఈ నెల 6న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ..

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 08:38 AM

కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలనకు ఈ నెల 6న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ..

కొద్దిరోజులుగా మేడిగడ్డ బ్యారేజీ అంశం తెలంగాణ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం పై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించేందుకు ఈ నెల 6న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ వస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన చేశారు. ఎలాంటి అవగాహన లేకుండా కాళేశ్వరం బ్యారేజీలను నీటితో నింపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు.

‘‘నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఖాళీ చేశాం. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ తిరిగి నీటిని నింపాలని డిమాండ్ చేయడం బాధ్యతా రాహిత్యమే. మేడిగడ్డ పియర్లు కుంగిన తరువాత అప్రమత్తమైన మా ప్రభుత్వం ఆ బ్యారేజీతో పాటు మిగిలిన రెండు బ్యారేజీలపై విచారణ నిర్వహించాలని ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డిజైన్లు, నిర్మాణాలను అన్ని కోణాల్లో పరిశీలించామని, పగుళ్లు, కుంగుబాటుకు కారణాలు విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిఫార్సులు చేయాలని కోరింది. నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీకి ప్రభుత్వం ఇటీవల గడువు విధించింది. అయినప్పటికీ వీలైనంత త్వరగా కమిటీని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. డిజైన్లు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ.. అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కింది’’ అని మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి విమర్శించారు. దిన్నీ బట్టి చూస్తుంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనలు వెలువడే వరకు ఈ అంశం పై స్పష్టత వచ్చే అవకాశం లేదనే అనిపిస్తుంది.





Untitled Document
Advertisements