ఏపీ ఎన్నికల ముంగిట ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సర్వే ఫలితాలను వెల్లడించి అధికార పార్టీ శ్రేణుల కోపానికి కారకులుగా మారారు. పీకే ఏపీలో రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ఈసారి అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, జగన్ ఏం చేసినా గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. పథకాల పేరిట ప్రజలకు డబ్బు ఇస్తుండడం ఎన్నికల్లో ఎంతమాత్రం పనిచేయదని స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గతంలో సొంతంగా సర్వేలు చేయించి, ఎన్నికల ఫలితాలపై ముందే అంచనాలు వెలువరించేవారు. ప్రశాంత్ కిశోర్ సంగతి తెలిసిందే. ఐప్యాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వ్యూహకర్తగా సేవలు అందించడం మానేసి రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన చేసిన వాఖ్యలు వైసీపీ శ్రేణులలో పెద్ద ధుమారమే రేపాయి.