ఈ వేసవిలో రుచికరమైన సగ్గుబియ్యం వడియాలు పెట్టేయండిలా సులభంగా

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 05:42 PM

ఈ వేసవిలో రుచికరమైన సగ్గుబియ్యం వడియాలు పెట్టేయండిలా సులభంగా

వేసవికాలం మొదలైంది. ఎండలు బగ్గుమంటున్నాయి. ఎండలతో పాటు ఊరగాయలు, వడియాలు, అప్పడాలు పెట్టె సమయం కూడా వచ్చేసింది. వేసవి వచ్చిందంటే ప్రతి ఇంట్లోను వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు పెట్టడం కామన్. వడియాలు, అప్పడాలు అనగానే మనం బియ్యంతో తయారు చేస్తాము. ఆయితే ఎపట్లా కాకుండా ఈసారి కూడా మండే ఎండల్లో ఈసారి సగ్గుబియ్యం వడియాల పెట్టండి చాలా రుచిగా ఉంటాయి. మరి సగ్గుబియ్యం వడియాల తయారీకి కావలసిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

సగ్గు బియ్యం (లావు సగ్గుబియ్యం) – నాలుగు గ్లాసులు పచ్చి మిరపకాయలు – 15 జీలకర్ర – ముప్పావు స్పూను. ఉప్పు – రుచికి తగినంత. కాచి చల్లార్చిన పాలు – ఒక అర గ్లాసు.

తయారీ విధానము:
సగ్గుబియ్యం వడియాలు పెట్టుకునే ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో ఒక గ్లాస్ కొలత ప్రకారం సగ్గుబియ్యాన్ని పోసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. మర్నాడు ఉదయమే ఏ కొలత ప్రకారం సగ్గుబియ్యం వేసుకున్నామో ఆ గ్లాస్ తీసుకుని మరొక గిన్నెలో ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఆరు గ్లాసుల చొప్పున నీరు పోసుకోవాలి.
ఇప్పుడు ఆ నీటిని గ్యాస్ స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇంతలో పచ్చి మిర్చి , ఉప్పు, జీలకర్ర వేసుకుని మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీరు బాగా మరిగించిన తర్వాత పచ్చి మిర్చి పేస్ట్ ను వేసుకుని గరిటతో బాగా కలపాలి. వెంటనే నానబెట్టిన సగ్గు బియ్యం ను కూడా వేసుకుని మంటను మీడియం సెగలో పెట్టుకుని సగ్గు బియ్యం గింజలు బాగా ఉడికించాలి.
సగ్గుబియ్యం గింజలు బాగా ఉడికి లావయ్యి బాగా దగ్గర పడి మెత్తగా అంటే గింజలు పూర్తిగా స్మాష్ అయ్యే వరకు దగ్గరే ఉండి ఉండకట్టకుండా మరియు అడుగంటకుండా గరిటెతో బాగా కలుపుతుండాలి. సగ్గుబియ్యము బాగా ఉడికి దగ్గర పడ్డాక ఒక అర గ్లాసు కాచి చల్లార్చిన చిక్కని పాలు అందులో పోసి గరిటెతో బాగా కలిపి దింపు కోవాలి. ఇలా పాలు పోస్తే సగ్గు బియ్యం వడియం వేగిన తర్వాత మల్లెపూవులా తెల్లగా ఉంటాయి . పాలు పోసిన తర్వాత దానిని ఒక పది నిముషాలు చల్లారనివ్వాలి.

కొద్దిగా చల్లారిన తర్వాత ఎండలో కాటన్ బట్టపై ఒక గరిటెతో కాచిన సగ్గుబియ్యాన్ని గుండ్రముగా పెట్టుకోవాలి . వడియాలు వీలయినంత పల్చగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాలు ఎండలో రోజంత ఆరనివ్వాలి . బాగా ఎండిన తరువాత అవి వాటంతట అవే ఊడివస్తాయి. అప్పుడు వాటిని తీసి గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలకు నీరు తగలక పొతే, ఏడాది పాటు నిల్వ ఉంటాయి. వర్ష కాలంలో గాని ,చలి కాలంలో గాని ,పిల్లలకు ఎపుడైనా స్నాక్స్ గా కానీ కాసిని వడియాలు తీసుకుని నూనెలో వేయించుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడియాలను పప్పు, రసం, సాంబార్ వంటి వాటిలో అన్నం పక్కన పెట్టుకొని తింటే బలే రుచిగా ఉంటాయి .





Untitled Document
Advertisements