కొనసాగుతున్న ఈడీ విచారణ, కవిత స్టేట్‌మెంట్ రికార్డ్ .. లాయర్‌ను లోనికి రానివ్వని అధికారులు

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 05:09 PM

కొనసాగుతున్న ఈడీ విచారణ, కవిత స్టేట్‌మెంట్ రికార్డ్ .. లాయర్‌ను లోనికి రానివ్వని అధికారులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు ఆమె నివాసంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు విచారించి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. మొత్తం 12 మంది ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చారు. ఇందులో ఢిల్లీ నుంచి ఏడుగురు అధికారులు ఉండగా వారిలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. ఈ మహిళా అధికారుల సమక్షంలో కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. మద్యం కేసుకు సంబంధించి ఆమె వద్ద ఉన్న డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 12 మంది ఈడీ ఆధికారుల్లో ఐదుగురు కవిత నివాసంలోకి వెళ్లగా.. మిగతా అధికారులు మాత్రం ఇంటి బయట ఉండిపోయారు.

కవిత నివాసంలోకి లాయర్‌ను అనుమతించని అధికారులు

ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు లాయర్ సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు. బయట ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కవిత కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఈ నెల 19న కేసు విచారణ ఉందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని సుప్రీంకోర్టుకు కూడా ఈడీ చెప్పిందని వెల్లడించారు. కవితను కలవడానికి వెళితే లోనికి అనుమతించలేదన్నారు.

కేసు పెండింగ్‌లో ఉన్నందున అధికారులు ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉందన్నారు. తీర్పు వచ్చే వరకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని ఈడీ స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలిపారు. ఈడీ అధికారులు బయటకు వచ్చాక గానీ ఏమీ చెప్పలేమన్నారు. ఈడీ అధికారులు లోపల సెర్చ్ చేస్తున్నారని ఎలా చెప్పగలమని.. వారు మాటకు వచ్చిన తరువాత వారితో మాట్లాడిగాని వారి రాకకు కారణం ఏంటి అనేది చెప్పలేము అన్నారు.





Untitled Document
Advertisements