సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి తన సొంత పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జనసేనకు రాజీనామా చేశాక కొంతకాలం రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు. ఈసారి ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
ఇవాళ విశాఖ ఎంవీపీ కాలనీలో తమ పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇటీవల జై భారత్ పార్టీ సహా 8 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమికి లక్ష్మీనారాయణ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఏపీ ఎన్నికలలో పాల్గొంటున్న పార్టీలన్నీ కూడా పోటాపోటీగా తలపడనున్నాయి.
కాగా, జై భారత్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించడం తెలిసిందే.