ప్రస్తుత జనరేషన్ లో మద్యం తాగడానికి ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరు కలిసి తాగే కల్చర్ కొన్నిచోట్ల కన్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి ఒకరు ఈ విషయాన్నీ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను మద్యానికి బానిసనయ్యానని బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత పూజాభట్ తెలిపారు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను సిగ్గుపడటం లేదని అన్నారు. దాదాపు ఏడున్నరేళ్ల పాటు తాను మద్యంతో సహజీవనం చేశానని... ఆ తర్వాత మెల్లగా దాన్నుంచి బయటపడ్డానని చెప్పారు. తాము ఆడవాళ్లం కూడా తాగుతామని... దాన్నుంచి బయట పడతామని కూడా అన్నారు. ఈ జనరేషన్ లో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నామని... దీంతో, ఒత్తిడిని తట్టుకోవడానికి మద్యానికి అలవాటు పడుతున్నామని చెప్పారు. అయితే దాన్నుంచి తాము త్వరగానే బయట పడగలమని చెప్పారు. అయితే, మద్యం అలవాటు నుంచి బయటపడనివారు మాత్రం వినాశనాన్ని కొనితెచ్చుకున్నట్టేనని అన్నారు.
తాను మందుకు బానిస అయిన సమయంలో ఓ టైమ్ లో అందరూ తనను తాగుబోతు అని పిలిచేవారని పూజాభట్ చెప్పారు. మద్యం అలవాటు నుంచి పూర్తిగా బయట పడాలని అనుకున్నానని.... అయితే ఆ వ్యసనం నుంచి బయట పడటం అంత ఈజీగా జరగలేదని అన్నారు. మద్యం అలవాటును మానేయడానికి తాను నిజంగానే ఓ పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి మహిళలు భయపడతారని... ఈ సమస్య అందరికీ ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా మహిళలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడాలని చెప్పారు.