ఐపీఎల్ ఫైనల్స్ వరకు అత్యుత్తమ ఆట తీరుతో దూసుకెళ్ళిన ఎస్ఆర్హెచ్ టీమ్ ఫైనల్స్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక తన టీం ఓటమితో కావ్య మారన్ కన్నీటిపర్యంతమైన తీరు చూసి క్రికెట్ అభిమానులందరూ చలించిపోయారు. చివరకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ను కూడా కావ్య మారన్ కన్నీరు కదిలించింది. ఎస్ఆర్హెచ్ ఓటమి తరువాత బిగ్ బీ నెట్టింట ఓ పోస్ట్ చేశారు.
‘‘ఐపీఎల్ అయిపోయింది. కేకేఆర్ తిరుగులేని విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్కు అసలు అవకాశమే లేకుండా పోయింది. ఎస్ఆర్హెచ్ ఓటమి అనేక రకాలుగా విచారం కలిగిస్తోంది. గత మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ఎస్ఆర్హెచ్ ఓటమి కంటే కావ్య మారన్ కన్నీరు పెట్టడం ఎంతగానో కదిలించింది. తన టీం ఓటమి తరువాత ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. చివరకు కెమెరా కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. అయితే, రేపటి రోజుకు మళ్లీ నూతనోత్సాహంతో మొదలుపెట్టాలి’’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.
కాగా, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్కు అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, వెంకటేశ్, అనన్యా పాండే, షనాయా కపూర్, జాహ్నవి కపూర్, రాజ్కుమార్ రావు వంటి నటీనటులు మ్యాచ్ ను ఆసాంతం ఆస్వాదించారు. ప్రస్తుతం బిగ్ బీ పెట్టిన పోస్ట్ నేట్టింట వైరల్ గా మారింది.