చండీగఢ్, ఫిబ్రవరి 9: రానున్న సార్వత్రిక ఎన్నికల తరుణంలో అన్ని రాజకీయ రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టారు. కాగా హర్యానా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలాకి షాకిచ్చి మరోపార్టీతో చేతులు కలిపారు. చౌతాలా సారథ్యలోని ఐఎన్ఎల్డీకు మాయావతి గుడ్బై చెప్పి.. బీజేపీ రెబల్ ఎంపీ రాజ్కుమార్ సైనీ నేతృత్వంలోని ఎల్ఎస్పీ(లోక్తంత్రా సురక్షా పార్టీ)తో ఆమె చేతులు కలిపారు. ఈ క్రమంలో ఈరోజు రెండు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో బీఎస్పీ ఎనిమిది, ఎల్ఎస్పీ రెండు స్థానాల్లో కలిపి పోటీచేస్తున్నట్లు శనివారం వారు వెల్లడించారు. ఇదే పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని వారు తెలిపారు. కాగా ఐఎన్ఎల్డీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీన పడుతున్నందునే మాయావతి ఎల్ఎస్పీతో చేతులు కలిపినట్లు సమాచారం. ఇటీవల హర్యానాలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ, ఐఎన్ఎల్డీ వరస ఓటములను చవిచూసాయి.