ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల సరళి, రాజకీయ పరిణామాలు, తర్వాతి కార్యాచరణపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తమ దృష్టికి వచ్చిన అనేక విషయాలను నేతలు పవన్ కల్యాణ్ కు వివరించారు.
అదేవిధంగా వచ్చే నెల నుంచి మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థులు వచ్చి పవన్ను కలిశారు. ఎన్నికల సరళి, కౌంటింగ్ జరిగిన విధానాన్ని పవన్ కల్యాణ్ తో పంచుకున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యమంటూ బరిలో దిగిన జనసేనకు ఈ ఎన్నికల్లో తీవ్రమైన నిరాశ కలిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీచేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.