ఇండియాలో చైనా యాప్స్ బ్యాన్...నెక్స్ట్ టార్గెట్ అదేనా?

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 03:17 PM

ఇండియాలో చైనా యాప్స్ బ్యాన్...నెక్స్ట్ టార్గెట్ అదేనా?

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయంలో ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు ప్రారంభించింది. 5జీ సేవల కోసం ఇప్పటికే చైనా కంపెనీల నుంచి కొనుగోలుచేసిన పరికరాలను పక్కనబెట్టాలని భావిస్తోంది. సోమవారం కేంద్రంలోని సీనియర్ మంత్రుల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, వొడాఫోన్ ఐడియా వంటి బిడ్డర్ల బలహీనమైన ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో 5జీ స్పెక్ట్రం వేలం కనీసం ఏడాది వాయిదా పడింది. చైనాకు చెందిన హువాయ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనీసం ఏడాది పాటు నిషేధం విధించారు. అంతేకాదు, బ్రిటన్, ఇండియా సహా తన వాణిజ్య భాగస్వామ్య దేశాలను కూడా హువాయ్‌పై నిషేధం విషయంలో ఆలోచించాలని అమెరికా యంత్రాంగం ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.
వాణిజ్యపరంగానూ డ్రాగన్‌ను దెబ్బకొట్టాలని భావిస్తోన్న భారత్.. ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ నిర్ణయించింది. ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్‌ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

ప్రయివేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తిచేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించమనే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ లాంటి టెలికం సంస్థలు చైనాకు చెందిన హువాయ్‌ నెట్‌వర్క్స్‌తోనూ, బీఎస్ఎన్ఎల్ జీటీఈతో కలిసి పనిచేస్తున్నాయి. చైనా సంస్థలు ఉత్పత్తిచేసే నెట్‌వర్క్ పరికరాల భద్రతపై ముందు నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.





Untitled Document
Advertisements