పండగలు, పబ్బాలు.. పూజలు, శుభకార్యాలు సందర్భం ఏదైనా పెద్దవారికి చిన్నవారు పాదాభివందనం చేయడం అనేది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుకగల కారణాలు ఏంటి అంటే.. పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్ధప్రేమ, వారు చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనం చేస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు బిడ్డలు చేసే పాదాభివందనాన్ని ఈ సందర్భంలో పేర్కొనాలి. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు వారి ఆశీర్వాదాలు అందుకుంటారు. కుటుంబంలో, సమాజంలో ప్రజల మధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవంతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం మనకు అందిస్తుంది, ముఖ్యంగా తల్లికి పెట్టె నమస్కారం ఆరుసార్లు భూ ప్రదక్షిణ చేసినంత, పదివేల సార్లు కాశీ వెళ్ళివచ్చినంత, వందలాది సార్లు సముద్ర స్నానం చేసినంత. పుణ్యానికి పదిరెట్లు ఫలం మాతృవందనం ద్వారా కలుగుతుందని నీతిశాస్త్రం భోదిస్తుంది.