కొంతమంది పెద్దపెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. మరి కొంతమంది చదువు ఉన్నా లేకున్నా సొంతంగా పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారులు చేస్తుంటారు. అయితే మరికొంతమంది మాత్రం తమతమ కుల వృత్తులనె జీవనోపాధికి ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతుంటారు. అయితే ఇలా బీసీ కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడిన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 9న కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో రూ.1 లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్ధిదారులకు రూ.1 లక్ష పంపిణీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఫోటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం. పై వెబ్ సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకోవచ్చు. కుల వృత్తి, చేతి వృత్తులకు సంబంధించిన పని ముట్లు, ముడి సరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు.
విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలను రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.