ఈ మధ్యకాలంలో కుక్కలను పెంచుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కుక్కలు విశ్వాసం కలిగి ఉంటాయి. ఇంటికి కాపలాగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. అయితే ఇవే కుక్కలు మనుషుల పై దాడి చేసి వారి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. తాజగా తరచుగా దాడులకు పాల్పడుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్న 23 రకాల జాతుల పెంపుడు కుక్కల అమ్మకాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్న కేంద్రం.. వెంటనే వాటి సంతాన వృద్ధి (బ్రీడింగ్) ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది.
పిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్ షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల కుక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
,