లోక్ సభ ఎన్నికలకు ముందు జేఎంఎం ఎమ్మెల్యే, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన, సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ఎన్నికల ముంగిట రాజీనామా చేసి జెఎంఎంకు ఆమె భారీ షాకిచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన సీతా సోరెన్ బీజేపీ రాష్ట్ర నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. జేఎంఎంలో తనను పట్టించుకోవడం లేదని, ఒంటరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పర్యాయాలు సీతా సోరెన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి ఎస్టీలు జేఎంఎంకు ప్రధాన ఓటు బ్యాంకు. ఇప్పుడు సీతా సోరెన్ బీజేపీలో చేరడం గమనార్హం. ఆమె పార్టీ అధినేతకు రాజీనామా లేఖను పంపించారు.
పద్నాలుగేళ్లుగా తాను పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తనకు గౌరవం దక్కలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. జేఎంఎంలో తగిన గౌరవం దక్కనందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాల మీద ఉన్న నమ్మకంతో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. తన భర్త మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలంతో పాటు పరిస్ధితులు మారతాయని తాను సహనంతో ఉన్నప్పటికీ.. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడంలో పార్టీ చొరవ చూపడం లేదని ఆరోపించారు. కాగా, హేమంత్ సోరెన్ అన్న దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్. దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. మరి ఈ సమయంలో సీతా సోరెన్ కమల దళంలో చేరడం కమలనాధులకు ఏ మేరకు కలసి వస్తుంది అనేది చూడాలి.