ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. క్రీడాభిమానులకు పండగ వంటి ఐపీఎల్ సీజన్ లో భాగంగా మొహాలిలో మంగళవారం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో మ్యాచ్ లో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. 20 ఏళ్ల ఈ యువ క్రికెటర్ తన ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ ఆంధ్రా బ్యాటర్ 37 బంతుల్లో ఐదు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయడం విశేషం. తాను ఆడిన నాలుగో ఐపీఎల్ మ్యాచులోనే ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు. అటు హైదరాబాద్ జట్టులో తనకుంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ఇంతకీ ఈ యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి ఎవరు?
దేశవాళీ క్రికెట్లో నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. అతను మంగళవారం నాటి మ్యాచ్ కు ముందు కేవలం ఎనిమిది టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 2023లో రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయి. అందులో నితీశ్కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా, దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో అతడిని సన్రైజర్స్ ఫ్రాంచైజీ తన బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.
ఇక ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా తరపున రంజీ ట్రోఫీలో ఏడు మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచులలో 366 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అలాగే అండర్-19 స్థాయిలో ఇండియా-బీ తరపున ఆడిన నితీష్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 566 పరుగులు చేశాడు. ఇక 22 లిస్ట్-ఏ మ్యాచులు ఆడి 36.63 సగటుతో 403 పరుగులు చేశాడు. అలాగే మీడియం పేస్ బౌలింగ్ వేసే నితీశ్ దేశవాళీ మ్యాచుల్లో 52 వికెట్లు తీశాడు. అందులో 5 వికెట్ల ప్రదర్శన రెండు సార్లు నమోదు చేయడం విశేషం.