ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను విచారిస్తున్న ఈడీ తాజాగా ఎమ్మెల్సీ కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈ ఉదయం సోదాలకు దిగింది. ఆమె అరెస్ట్ తర్వాత జరుగుతున్న మొదటి సోదాలు ఇవే కావడంతో మరోమారు కలకలం రేగింది. ఈ ఉదయం 6.40 గంటలకు మాదాపూర్లోని డీఎస్ఆర్ హోమ్స్కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ-బ్లాక్లోని మూడో అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు.
కవిత అరెస్ట్ తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సోదా జరుగుతుండడంతో ఈ కుంభకోణంలో ఇంకా ఎంతమంది పాత్ర ఉందో అనే అనుమానాలు కలుగుతున్నాయి.