పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ చట్నీ.. వేడి అన్నంలో నెయ్యితో పాటు తింటే అదిరిపోద్ది అంతే

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 10:05 AM

పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ చట్నీ.. వేడి అన్నంలో నెయ్యితో పాటు తింటే అదిరిపోద్ది అంతే

ఎండాకాలం రాగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడికాయ .అబ్బా దానిని చూడగానే అందరికి నోట్లో నీరు ఊరుతుంది. కాస్త పుల్లగా ఉండే మామిడికాయలు తినకుండా వేసవి సీజన్ ముగియదు. అయితే ఈ సీజన్లో వచ్చే మామిడి కాయతో పచ్చళ్లు పెట్టడం ఫేమస్. అయితే ఇన్‌స్టెంట్‌గా మామిడికాయ చట్నీ చేసుకోండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది.
నిజానికి ఏప్రిల్‌ నెల ప్రారంభం కాగానే మార్కెట్‌లో మామిడికాయలు విరివిగా వస్తుంటాయి. అలాగే మామిడి చెట్ల నిండా కాయలు కనిపిస్తాయి. ఈ మామిడికాయను ఊరగాయకు ఉపయోగిస్తారు. కాయగానే ఉన్నప్పుడే కోసి ఉప్పు, కారం వేసి ఊరగాయ తయారుచేస్తారు.
దీనితో పాటు మామిడికాయతో నోరూరించే చట్నీ కూడా చేస్తారు. మామిడికాయ చట్నీ తింటే నోరూరుతుంది. ఎందుకంటే దాని పులుపు రుచి చూసిన వారికే తెలుసు దాని టేస్ట్.వేడి వేడి అన్నంలో చెట్నీ ,నేయి వేసుకొని తింటే ఆ రుచే వేరు . అంతేకాకుండా అల్పాహారంతోనో రుచి చూస్తే అమోఘం. చట్నీ చేయడానికి ప్రత్యేకమైన మామిడికాయలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ పుల్లని మామిడికాయ చట్నీ చేయడం చాలా తేలిక. దీన్ని తయారు చేయడానికి ఏయే పదార్థాలు అవసరమో, మామిడికాయ చట్నీ తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం:

మామిడికాయ చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:

మామిడికాయ- 1, మినపప్పు-1 చెంచా, శనగలు- 1 స్పూన్, మెంతులు - పావు చెంచా, ఎండు మిరియాలు - 4, పచ్చిమిర్చి - 2, ఆవాలు - 1 స్పూన్, ఇంగువ కొంచెం, వెల్లుల్లి రెండు, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి తగ్గట్టుగా, జీలకర్ర కొద్దిగా.


మామిడికాయ చట్నీ తయారీ విధానం:

ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి మీడియం మంట మీద నూనె వేయాలి.
తర్వాత శనగలు, మినపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు ఎండు మిరియాలను వేసి వేయించాలి. కారంగా కావాలంటే ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవచ్చు.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన మసాలాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మామిడికాయ, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.బాగా మెత్తగా కాకుండా చేయాలి. దీని తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.దాని తర్వాత మిక్సీ పట్టుకున్న పదార్థాలు వేయాలి.కాసేపు వేయించాలి. ఆ తర్వాత చివరగా రుచి చూసి, ఉప్పు వేయాలా వద్దా చూసుకోవాలి. రుచికరమైన మామిడికాయ చట్నీ సిద్ధంగా ఉంది.
ఈ చట్నీ ఒక్కోసారి పుల్లగా మారవచ్చు. ఈ సందర్భంలో చట్నీకి నెయ్యి జోడించవచ్చు. అన్నంలో నెయ్యి కలుపుకుంటే మామిడికాయ పులుపు అంతగా అనిపించదు. దీనిని గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చు. దీనిని ఒకసారి టేస్ట్ చూశారంటే మళ్ళి మళ్ళి కావాలి అంటారు .





Untitled Document
Advertisements