ఇంటర్ పాసైనందుకు స్నేహితులతో వేడుక.. అనంతరం బైక్ యాక్సిడెంట్ రూపంలో నలుగురూ మృతి

     Written by : smtv Desk | Thu, Apr 25, 2024, 11:28 AM

ఇంటర్ పాసైనందుకు స్నేహితులతో వేడుక.. అనంతరం బైక్ యాక్సిడెంట్ రూపంలో నలుగురూ మృతి

మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా కబలిస్తుందో ఊహించడం ఎవరితరం. అప్పటి వరకు అందరి మధ్యలో ఆడిపాడిన వ్యక్తులు ఉన్నట్టుండి అసువులు బాస్తున్న సంగటనలు కోకొల్లలు. గత రాత్రి ఎవరి ఊహకు అందని రీతిలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లందకు చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌తేజ్, పొన్నాల రనిల్ కుమార్ ఒకే బైక్‌పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నిన్న వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పాసైన గణేశ్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకుని తిరిగి ఒకే బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో వర్ధన్నపేట, ఇల్లందలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్, బస్సు రెండూ అతివేగంగా వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా అర్దాంతరంగా మృత్యు ఒడిలోకి జారుకోవడంతో తలిదండ్రుల రోధనలు మిన్నంటుతున్నాయి.





Untitled Document
Advertisements