కోల్కతా, మే 4 : ఐపీఎల్ లో భాగంగా సొంత గడ్డపై కోల్కతా విజయం సాధించింది. అన్ని రంగాల్లో రాణించిన కోల్కతా చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఎల్లో ఆర్మీకు షాకిచ్చింది. చెన్నై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 17 .4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన భారీ లక్ష్యాన్ని చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. నరైన్ (2/20), కుల్దీప్ (1/34), చాల్వాల (2/35) చెన్నైని కట్టడి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కెప్టెన్ ధోని (43 నాటౌట్), వాట్సన్ (36) రాణించడంతో ఆ జట్టు 5 వికెట్లకు 177 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టు లో నరైన్ (32) మెరుపు ఆరంభాన్నిస్తే.. సారథి కార్తీక్ (45 నాటౌట్) కళ్లు చెదిరే ముగింపునిచ్చాడు. శుభమన్ గిల్ (57 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు సునీల్ నరైన్ కు లభించింది.