గుంటూరు, మే 4: దాచేపల్లి అత్యాచార ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సుబ్బయ్యను బహిరంగంగా శిక్షించాలంటూ ప్రజలు రెండు రోజుల నుంచి దాచేపల్లిని స్తంభింపజేశారు. నిందితుడు సుబ్బయ్య ఉరి వేసుకోవడం, ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసి, అండగా ఉండడంతో కేసు ముగిసినట్లేనని భావిస్తున్నారు. కీచకుడు సుబ్బయ్య తనకు తానుగా ఉరి వేసుకున్నాడా? లేక పోలీసులే విధించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ సుబ్బయ్య చనిపోలేదని, వేరేవాళ్లు ఉరి వేసి చంపారని ఆరోపించారు.