సిడ్నీ, మే 4 : ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన బాల్ టాంపరింగ్ వివాదంతో యావత్ ప్రపంచం ఒకింతా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆసీస్ ఆటగాళ్లు కెప్టెన్ స్మిత్, ఉపసారథి డేవిడ్ వార్నర్ పై 12 నెలలు.. బాన్ క్రాఫ్ట్ పై 9 నెలల నిషేధం విధించింది. ఈ ఉదంత౦ తర్వాత స్మిత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తొలిసారి స్పందించాడు. తన సతీమణి డానీ విల్స్తో దిగిన ఫొటోకు క్యాఫ్షన్గా అభిమానులకు భావోద్వేగ సందేశం పెట్టాడు.
"ఆస్ట్రేలియాకు తిరిగి రావడం గొప్పగా ఉంది. నేను కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో దూరంగా ఉన్నా. దాని నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. చాలామంది ఈమెయిల్స్, లెటర్స్తో నాకు మద్దతు తెలిపారు. మళ్లీ మీ నమ్మకాన్ని తిరిగి పొందుతాను. ఆ సమయంలో మా తల్లితండ్రులు, నా భార్య ఇచ్చిన మద్దతు మరువలేనిది. వారికి ధన్యవాదాలతో్ సరిపెట్టలేను. ప్రపంచంలో ముఖ్యమైనది కుటుంబమే. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు" అని స్మిత్ వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో యువఆటగాడు బాన్క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్కు యత్నిస్తూ కెమెరాలకు చిక్కడం.. ఇది జట్టు వ్యూహంలో భాగమని స్మిత్ ప్రకటించడం పెనుదుమారాన్ని రేపింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ముగ్గురిపై నిషేధం విధించింది. సీఏ చర్యతో స్మిత్, వార్నర్లను బీసీసీఐ ఈ సీజన్ ఐపీఎల్ నుండి బహిష్కరించింది.