లండన్, జూన్ 15 : ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఫుట్బాల్ ఫీవర్ తో ఊగిపోతుంది. జూన్ 14న మొదలైన ఈ సాకర్ సంబరంతో ఆతిథ్య జట్టు రష్యా గెలుపుతో బోణీ కొట్టింది. దీంతో ఏ జట్టు గెలుస్తుందో అని అన్ని దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. గత ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆక్టోపస్ జోస్యం దాదాపుగా నిజమైంది. దీంతో అనేక అంశాలపై జంతువులతో జోస్యాలు చెప్పించడం పాశ్చాత్య దేశాల్లో బాగా పాపులరైంది. ఎన్నికలు, క్రీడలు లాంటివే కాకుండా అనేక ఇతర అంశాలపై కూడా వివిధ రకాల జంతువుల చేత జోస్యం చెప్పించడం సాధారణమైపోయింది. ఇప్పటికే పిల్లి, పులి వంటి వాటితో జోస్యం ప్రారంభంకాగా, కొత్తగా ఒక పంది కూడా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం 32 జట్లతో ప్రారంభమైన ఈ ప్రపంచకప్ సెమి ఫైనల్ వరకు వెళ్లేవి నాలుగు జట్లే. కాగా 'మైస్టిక్ మార్కస్'గా పిలువబడే ఒక పంది అయితే ఆ నాలుగు జట్లను గుర్తించింది. అదెలాగంటే.. ఫిఫాలో పాల్గొనే దేశాల జెండాలు గల యాపిల్స్ను దాని ముందుంచారు. మొదట ఏ నాలుగు యాపిల్స్ను తింటే, ఆ జట్లు సెమీస్కు వెళ్లినట్లు. కాగా బెల్జియం, అర్జెంటీనా, నైజీరియా, ఉరుగ్వే జెండాలున్న యాపిల్స్ను మైస్టిక్ తిన్నది. దీంతో ఆ నాలుగు జట్లు సెమీస్ వెళ్లనున్నాయని ప్రచారం ఊపందుకుంది.