హైదరాబాద్, జూన్ 23 : మెగా పవర్ స్టార్ రామ్చరణ్ 'రంగస్థలం' సినిమాతో ఓ బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం చెర్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీని యాక్షన్ ఓరియెంటడ్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. బోయపాటి మాస్ సినిమాలు తీయడంలో దిట్ట. ఆయన చిత్రాల్లో హీరోలను ఓ రేంజ్ లో చూపిస్తారు. అందుకే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోందట. ఈ ప్రత్యేక గీతంలో రకుల్ ప్రీత్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే 'బ్రూస్లీ', 'ధ్రువ' సినిమాలతో అభిమానుల్ని మెప్పించిన ఈ జంట మరోసారి ప్రత్యేకగీతంలో చిందులు వేసే అవకాశం ఉందన్న వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో స్నేహ, తమిళ్ ఫేం ప్రశాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీకి జోడిగా కైరా అద్వానీ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలూ అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.