హరారే, జూలై 4 : ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ సునామీల చెలరేగిపోయాడు. ముక్కోణపు టీ 20 సిరీస్లో భాగంగా మంగళవారం జింబాబ్వేతో మ్యాచ్లో ఫించ్ చెలరేగి ఆడి కొత్త రికార్డు సృష్టించాడు. 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అతని పేరిటే ఉన్న 156 పరుగుల గత రికార్డును ఫించ్ సవరించుకున్నాడు. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ బ్యాటింగ్ చేపట్టింది. ఫించ్ హిట్టింగ్తో ముక్కోణపు టీ20 సిరీస్ మూడో మ్యాచ్లో ఆసీస్ 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు ఫించ్ విధ్వంసంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు చేసింది. 50 బంతుల్లోనే సెంచరీ చేసిన అతను.. మరో 36 బంతుల్లో 150 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఆఖరి ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అండ్రూ టై (3/12) విజృంభించడంతో ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులే చేసింది.