చెన్నై, జూలై 15 : తాజ్మహల్.. భారత్ లోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటైన ఈ కట్టడ౦ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనకున్న చరిత్ర ప్రస్తుతం హాట్టాపిక్ అవుతోంది. ఈ కట్టడానికి సంబంధించి చరిత్రను కొంతమంది దర్శకనిర్మాతలు ఒక వెబ్సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్దమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం గురించి చర్చించనున్నారు. ఈ వెబ్సిరీస్ కు 'తాజ్- ఎ మాన్యుమెంట్ ఆఫ్ బ్లడ్' అని పేరు పెట్టారు.
అప్పటి మొఘల్ చక్రవర్తులు.. జహంగీర్, అక్బర్, షాజహాన్ జీవితాలను కూడా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చరిత్రలో ప్రేమ మాత్రమే కాదు.. అసూయ, ద్వేషం, మోసం కూడా నిండి ఉన్నట్లు ఈ వెబ్సిరీస్ నిర్మాత సమీర్ నాయర్ పేర్కొన్నారు. చరిత్ర పుస్తకాల్లో ఇప్పటివరకూ చెప్పని కథను, ఆ సామ్రాజ్యంలోని చీకటి కోణాలను ఈ వెబ్ సిరీస్ లో ఆవిష్కరించనున్నారట. మొత్తంగా మూడు సీజన్లుగా దీన్ని రూపొందించి విడుదల చేస్తామని సమీర్ చెప్పుకొచ్చారు.