ముంబయి, ఫిబ్రవరి 11: దేశంలోనే తక్కువ టికెట్ ధరతో విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో సోమవారం 30 విమాన సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, జైపూర్ విమానాశ్రయాల నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన సర్వీసులు సోమవారం ఆపేసినట్లు సమాచారం.
హైదరాబాద్ విమానాశ్రయంలో 6, చెన్నైలో 8, జైపూర్ నగరంలో 3 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. కాగా విమాన సిబ్బంది కొరత వల్లనే తాము విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది. విమాన పైలెట్లు ఏడాదికి వెయ్యి గంటలు మాత్రమే నడపాలని, తమ పైలెట్లు దాన్ని అధిగమించారని సమాచారం.
అయితే, మంచు కురుస్తూ వాతావరణం సరిగా లేనందువల్లే విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఉత్తర భారతదేశంలో మంచు కురుస్తున్నందు వల్ల 11 ఇండిగో విమానాలను దారి మళ్లించామని అధికార ప్రతినిధి తెలిపారు. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు