రాహుల్ గాంధీని ఆయన సొంత నియోజకవర్గమైన అమేథిలో ఓడిస్తూ ప్రజలు తనకు అందించిన విజయంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేశారు. 'అమేథీకి నవోదయం' అంటూ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. 'అమేథి ప్రజల నవసంకల్పానికి ఇది కొత్త ఉదయం. ధన్యవాదాలు, సాదర ప్రణామాలు. అభివృద్ధిపై మీ విశ్వాసాన్ని ఉంచి కమలవికాసానికి మీరంతా తోడ్పడ్డారు. అమేథికి, మోదీ సర్కార్కు, విజయ్భారత్కు మరోసారి కృతజ్ఞతలు' అని ఆ ట్వీట్లో స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
'ఓవైపు ఒకే కుటుంబం, మరో వైపు ఓకే కుటుంబంగా పనిచేసే సంస్థ. ఆ సంస్థ, కార్యకర్తలు, కేరళ, బెంగాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలదే ఈ విజయం. వారందరి కుటుంబాలకు నా విజయాన్ని అంకింతం చేస్తున్నాను' అని స్మృతి ఇరానీ తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అమేథీ నుంచి 55,120 ఓట్ల ఆధిక్యంతో స్మృతి ఇరానీ తన విజయనాన్ని నమోదు చేసుకున్నారు. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీకి అమేథీ నియోజవర్గం గెలుపును అందిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరాశాజనకమైన ఫలితాలు సాధించినా అమేధీ నుంచి రాహుల్ గాంధీ ఒక లక్షా 7 వేల 903 ఓట్ల ఆధిక్యంతో ఇదే స్మృతి ఇరానీపై గెలుపొందారు.