వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు సాగుతుందని తెలిసిందే. అయితే ఈ నెలలో ఒసాకాలో జరుగనున్న జీ-20 సభ్యదేశాల సదస్సుకు హాజరు కాకుంటే చైనా ఉత్పత్తులపై టారిఫ్లను మరింత పెంచుతామన్న బెదిరింపులతో ట్రంప్ దౌత్యం నానాటికీ దిగజారుతోందని పరిశీకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా తమ దేశంతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తుందని, అంగీకరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా,చైనా దేశాలు వాణిజ్య చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ బెదిరింపు వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నానాటికీ దిగజారుతున్న అమెరికన్ దౌత్యానికి ఇది నిదర్శనమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైనా అమెరికా స్టడీస్లో సీనియర్ పాలసీ స్పెషలిస్ట్ సౌరభ్ గుప్తా వ్యాఖ్యానించారు.