2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా భారత్

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 11:38 AM

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశంలో మోడీ తమ భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ కోసం నీతి ఆయోగ్ పనిన్చేస్తుందని పేర్కొన్నారు. 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా భారత్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఆదాయ పెంపు, ఉపాధి కల్పనలో ఎగుమతుల విభాగమే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రం కూడా ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇది కష్టసాధ్యమైన పనే కానీ.. అసాధ్యం మాత్రం కాదని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రాలు తమ శక్తి సామర్థ్యాలను గుర్తించాలని అన్నారు. ఈ సందర్భంగా నీటి యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, జలవనరుల వినియోగంలో రాష్ట్రాలు అనేక విధాలుగా చొరవ తీసుకోవాలని మోదీ కోరారు. పాలనలో పారదర్శకత ఉంటే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితర ప్రధాన సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయిందని, ఇక ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.





Untitled Document
Advertisements