పీటీ ఉషాకు మరో అరుదైన ఘనత

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 01:16 PM

పీటీ ఉషాకు మరో అరుదైన ఘనత

భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్‌ పీటీ ఉషాకు తాజాగా మరో అరుదైన ఘనత దక్కింది. ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్ (ఏఏఏ) లోని అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా పీటీ ఉషాకు చోటు లభించింది. ఉషా ఆరుగురు సభ్యుల కమిషన్‌లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు. ఈ కమిషన్‌కు హ్యామర్‌ త్రోలో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ ఆండ్రీ అబ్దువలియేమ్ (ఉజ్బేకిస్థాన్‌) అధ్యక్షత వహించనున్నారు.చైనాకు చెందిన వాంగ్ యు, కజకిస్థాన్‌కు చెందిన ఓల్గా రిపాకోవా, మలేషియాకు చెందిన లీ హుప్ వీ మరియు సౌదీ అరేబియాకు చెందిన సాద్ షాదాద్ అథ్లెట్స్ కమిషన్‌లోని ఇతర సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏఏఏ సెక్రటరీ జనరల్ ఎ షుగుమారన్ కమిషన్‌ సభ్యులను అభినందించారు. 'ఏఏఏ అథ్లెట్స్ కమిషన్ సభ్యత్య నియామకాన్ని అంగీకరించా. ఇది నాకు, దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా' అని పీటీ ఉషా పేర్కొంది.ఇటీవలే అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్‌) పీటీ ఉషాను ప్రతిష్టాత్మక 'వెటరన్‌ పిన్‌' అవార్డుకు ఎంపిక చేసింది. భారత దేశంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం లాంటిదే వెటరన్‌ పిన్‌ అవార్డు. దోహాలో సెప్టెంబర్‌ 24న జరిగే ఐఏఏఎఫ్‌ కాంగ్రెస్‌లో ఉషాకు ఈ అవార్డును అందజేస్తారు.1964 జూన్ 27న కేరళలో ఉషా జన్మించారు. 1976లో అథ్లెటిక్ కోచ్ నంబియార్ ఉషా సామర్ధ్యాన్ని గుర్తించి కోచింగ్ ఇచ్చాడు. 1979-80 మధ్య జరిగిన అనేక జాతీయ స్థాయి పరుగు పోటీలలో పతకాలు సాధించింది. 1981లో జరిగిన అథ్లెటిక్స్‌ 100, 200 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇక 1985 ఆసియా క్రీడల్లో 100, 200, 400 మీటర్ల పరుగుతో పాటు 400 మీటర్ల హర్డిల్స్‌, 4్ఠ400 మీటర్ల రిలేలో ఐదు స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించింది.





Untitled Document
Advertisements