వచ్చేశా కదా టెన్షన్ ఎందుకు!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 04:58 PM

వచ్చేశా కదా టెన్షన్ ఎందుకు!

గురువారం భారత మాజీ క్రికెటర్, సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడుకి చెందిన వీబీ 1988-90 మధ్య కాలంలో భారత జట్టు తరఫున ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత సౌత్ జోన్ సెలక్టర్‌గా కూడా పనిచేసిన చంద్రశేఖర్.. ఓ ఇంటర్వ్యూలో ధోనీ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కి వీబీ మేనేజర్‌గా పనిచేశాడు. ‘మహేంద్రసింగ్ ధోనీని నేను తొలిసారి హైదరాబాద్‌లో కలిశాను. పాకిస్థాన్‌‌తో భారత్-ఎ జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. టీమ్‌లో వికెట్ కీపర్ లేడు. దీంతో.. ధోనీ‌కి పిలుపు అందింది. కానీ.. మ్యాచ్ ముందు రోజు అర్ధరాత్రి వరకూ ధోనీ హోటల్‌కి చేరుకోలేదు. అప్పుడు సెలక్టర్‌గా ఉన్న నేను.. కొంత మందికి ఫోన్ చేశాను. కానీ.. ధోనీ ప్రయాణం గురించి ఎవరూ కచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో నా రూమ్‌ డోర్‌ని కొట్టిన శబ్ధం వినపడింది. హోటల్ వెయిటరేమో..? అనుకుని వెళ్లి తలుపు తీశా. ఓ వ్యక్తి జులపాల జుట్టుతో నా ముందు నిల్చొన్నాడు. అప్పటి వరకూ నేను ధోనీని కనీసం ఫొటోల్లో కూడా చూడలేదు. దీంతో.. ఎవరు..? అనేలా కోపంగా చూశా. కానీ.. నా ముందు నిల్చున్న ధోనీ చిరునవ్వుతో కూల్‌గా తనని తాను పరిచయం చేసుకున్నాడు. అయితే.. అతను లేట్‌గా రావడంతో ‘ఇప్పుడు టైమ్ 11 గంటలు’ అవుతోంది అనేలా నేను ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చా. దానికి ధోనీ.. వచ్చేశా కదా టెన్షన్ ఎందుకు..? అనేలా నవ్వుతూ హావభావాలు ప్రదర్శించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ధోనీ అన్ని విషయాల్లోనూ అంతే చురుగ్గా వ్యవహరిస్తున్నాడు’ అని చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు.





Untitled Document
Advertisements