కాలిఫోర్నియా : మనిషి చందమామ పై కాలు మోపి 50 ఏళ్లు కావొస్తోంది. ఇంకా మనం విశ్వం లోని మిస్టరీలను ఛేదించడానికి భూమి నుండి తప్పించుకునేందుకు కలలు కంటూనే ఉన్నాం!సుదూర గ్రహాంతరయానానికి మన చందమామను వేదికగా మార్చుకోవాలని మనిషి ఎంతోకాలంగా ఆలోచిస్తున్నాడు. ఎలన్ మస్క్ లాంటివాళ్లు 2023 నాటికి అంగారకుడిపై మానవ కాలనీ ఏర్పాటు చేస్తానని ప్రకటించగా.. వర్జిన్ గెలాక్టిక్తో రిచర్డ్ బ్రాస్నన్, బ్లూ ఆరిజన్తో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్లు.. అంతరిక్షపర్యటన కలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ద గేట్వే ఫౌండేషన్’అనే కంపెనీ అంతరిక్షంలో తేలియాడే హోటల్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. ‘ద వాన్ బ్రాన్ స్టేషన్’అని దీన్ని పిలవబోతున్నారని తెలిపింది. 400 మంది అతిథులు ఉండేందుకు వీలుగా ఈ అంతరిక్ష హోటల్ను అందుబాటులోకి తెస్తున్నారు.ఈ హోటల్లో బార్తోపాటు రెస్టారెంట్లు, సినిమా హాల్ సైతం ఉంటాయి. సెమినార్లు నిర్వహించేందుకు ప్రత్యేక హాల్ కూడా ఏర్పాటు చేస్తారు.‘ద గేట్వే ఫౌండేషన్’ అనే సంస్థ ఈ హోటల్ డిజైన్లను రూపొందించింది.అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికతనే ఈ హోటల్ నిర్మిస్తారు.ఐఎస్ఎస్ ఉన్నట్లుగానే ఈ హోటల్లో కూడా ఆర్టిఫిషియల్ గ్రావిటీ (కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి) ఉంటుంది. దీనివల్ల అంతరిక్షంలో సైతం భూమి మీద ఉన్నట్లే నడవచ్చు.అతిథులను ప్రత్యేక స్పేస్క్రాఫ్ట్లలో ఈ హోటల్కు చేరుస్తారు.190 మీటర్ల వ్యాసంలో చక్రం రూపంలో ఉంటుంది. ఇందులో 24 పాడ్స్ ఉంటాయి. అతిథులు ఈ గదుల్లో ఉంటారు. దీనికి ఉండే అద్దాల కిటికీల నుంచి అంతరిక్షం, భూమిని వీక్షించవచ్చు.ఈ హోటల్ను 2025 కల్లా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు.‘వాన్ బ్రాన్ స్పేస్ స్టేషన్’గా పిలిచే ఈ హోటల్ అందుబాటులోకి రాగానే.. 1400 మంది అతిథుల కోసం మరో అంతరిక్ష హోటల్ను నిర్మించాలని భావిస్తోంది.