BREAKING: వరంగల్ చిన్నారి హత్యాచారం కేసు నిందితునికి యావజ్జీవ శిక్ష

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 08:16 AM

వరంగల్‌లో తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసిన నీచునికి కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసును కేవలం 51 రోజుల్లో విచారణ పూర్తిచేసిన వరంగల్ కోర్టు ప్రవీణ అలియాస్ పవన్‌ను దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును నిందితుడు హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుడి శిక్షను తగ్గించింది. నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దోషి చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. ఆగస్టు 7న వరంగల్ కోర్టు తీర్పును వెలువరించగా, గతంలో నిందితుడి తరఫున వాదించటానికి ఎవరూ ముందుకు రాకూడదని బార్ కౌన్సిల్ తీర్మానించింది. హన్మకొండకు చెందిన పోలెపాక ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌ (25) ఈ ఏడాది జూన్‌ 18న అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ ఇంటి మేడపైకి ఎక్కి నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని అపహరించాడు. అనంతరం పసికందను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి హత్యచేశాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిందితుడిని ఉరి తీయాల్సిందేనని నినదించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వరంగల్ పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేశారు. నిందితుడిపై అపహరణ, అత్యాచారం, హత్య తదితర నేరాలతోపాటు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసులు నమోదు చేశారు. 30 మంది సాక్షులను విచారించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పసికందుపట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడికి వరంగల్ జిల్లా ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ వెలువరించింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరేసరి అని న్యాయమూర్తి కె.జయకుమార్‌ సంచలన తీర్పు వెల్లడించారు. తాజాగా, ఈ తీర్పును సమీక్షించిన హైకోర్టు నిందితుడు ప్రవీణ్‌కు శిక్ష తగ్గించింది. తుదిశ్వాస విడిచే వరకు ప్రవీణ్‌ను జైల్లోనే ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది.





Untitled Document
Advertisements