పెళ్లి పేరుతో ఎన్నారైని నిలువునా ముంచేసిన యువతి

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:57 PM

పెళ్లి పేరుతో ఎన్నారైని నిలువునా ముంచేసిన యువతి

పెళ్లి పేరుతో ఓ ఎన్నారై నుంచి ఏకంగా రూ. 13 లక్షలు కాజేసిందో యువ. చండీగఢ్‌లోని సుల్తాన్‌పూర్ లోధిలో ఈ ఘటన ఇటీవల వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుల్తాన్‌పూర్ లోధికి చెందిన అజిత్ సింగ్ కుమారుడు కుల్వీందర్ సింగ్ కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కుల్వీందర్‌కు సుల్తాన్‌పూర్ లోధికే చెందిన అమన్‌దీప్ కౌర్‌, ఆమె సోదరుడు హార్‌ప్రీత్ సింగ్‌తో ఫ్రాన్స్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో వీరి ముగ్గురూ తరుచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో అమన్‌దీప్ కౌర్‌తో కుల్వీందర్‌కు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత అమన్‌దీప్ కౌర్‌ ఉన్నట్లుండి ఇండియాకు తిరిగివచ్చేసింది. స్వదేశానికి వచ్చేసిన ఆమె కొంత కాలం తర్వాత కుల్వీందర్‌కు ఫోన్ చేసి.. తాను ఫ్రాన్స్ వచ్చేందుకు డబ్బు పంపించాలని కోరింది. దీంతో కుల్వీందర్‌ కొంత డబ్బులు పంపించాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి వీసా కోసం డబ్బులు తక్కువ అయ్యాయని చెప్పింది. ఇలా 2016 ఆగస్టు నుంచి మూడేళ్లుగా పలు దఫాల్లో కుల్వీందర్‌ నుంచి అమన్‌దీప్ ఏకంగా రూ. 13 లక్షలు వసూలు చేసింది. కానీ, ఆమె ఫ్రాన్స్‌కు మాత్రం వెళ్లలేదు. దీంతో అనుమానం వచ్చిన కుల్వీందర్‌ తన తండ్రి అజిత్ సింగ్‌కు జరిగిన విషయం చెప్పాడు. దీంతో అమన్‌దీప్ కౌర్ గురించి వాకాబు చేసిన అజిత్ సింగ్‌కు దిమ్మతిరిగే నిజం తెలిసింది. ఆమెకు అప్పటికే వివాహమైందని వెల్లడైంది. పెళ్లి పేరుతో తన కొడుకు నుంచి ఆమె భారీ మొత్తంలో దండుకుందని తెలిసి అజిత్ సింగ్ నిర్ఘాంతపోయాడు. దీంతో కుల్వీందర్ వద్ద తీసుకున్న రూ. 13 లక్షలు తిరిగి ఇచ్చేయాలని ఆమె కుటుంబ సభ్యులను అడిగాడు. అయితే అమన్‌దీప్ కౌర్ కుటుంబ సభ్యులు మాత్రం డబ్బు తిరిగి ఇచ్చేందుకు ససేమీరా అన్నారు. దీంతో చేసేది లేక చివరకు అజిత్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు అమన్‌దీప్ కౌర్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements