ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు...ఒకరు మృతి

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 07:03 PM

ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు...ఒకరు మృతి

గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...టిఎస్ 02 యుఎ 4165 నెంబర్ గల బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి వెళుతుండగా 11 ఇంక్లైన్ బస్‌స్టాండ్ వద్ద 8వ కాలనీలో చేపలు అమ్ముకునేందుకు వస్తున్న టిఎస్ 22టి 1649 నెంబర్ గల ఆటో ట్రాలీని ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టడంతో ఆటో నాలుగైదు పల్టీలు కొట్టింది. డ్రైవర్ గంటసాల ఆదిశేషు (35) స్టీరింగ్ ప్రక్కనే కుప్పకూలిపోయాడు. ఇందులో ఉన్న యువకుడు గంటసాల ఫణీంద్ర (18) సైతం తీవ్రంగా గాయపడ్డాడు. నోట్లో నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఫణీంద్రను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. వీరిది కృష్ణా జిల్లా కాగా గోదావరిఖనిలో ఉంటూ చేపల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణీకులు ప్రమాదం జరిగిన తీరును చూసి అరవడంతో బస్సు కొద్ది దూరం వెళ్లిన తరువాత నిలిపి వేశారు. బస్సు డ్రైవర్ కుమార్‌ కు ప్రయాణీకులు దేహశుద్ది చేశారు. అనంతరం వీరిని తప్పించుకొని గోదావరిఖని టూటౌన్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని సిఐ గాండ్ల వెంకటేశ్వర్లు సందర్శించారు. ఎస్‌ఐ ఎం శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements