కరోనా కట్టడికి మహీంద్రా ఫేస్ షీల్డ్‌..!

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 05:18 PM

కరోనా కట్టడికి మహీంద్రా ఫేస్ షీల్డ్‌..!

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా తాజాగా ఫేస్ షీల్డ్‌లను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. మెడికల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇవి అందజేస్తామని పేర్కొంది. మార్చి 30 నుంచి అంటే రేపటి నుంచి వీటిని తయారు చేస్తామని తెలిపింది. కండివలి ఫెసిలిటీలో తొలుత రోజుకు 500 యూనిట్లను తయారు చేస్తామని పేర్కొంది. తర్వాత తయారీని మరింత పెంచుకుంటూ వెళ్తామని తెలిపింది.

ఫోర్డ్ కంపెనీ నుంచి ఫేస్ షీల్డ్ డిజైన్ తీసుకున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘మా భాగస్వామి ఫోర్డ్ నుంచి ఫేస్ షీల్డ్ డిజైన్ తీసుకున్నాం. ఇప్పుడు వీటిని తయారు చేసేందుకు రెడీగా ఉన్నాం. మెడికల్ సర్వీస్ ప్రొవైడర్లు వీటిని ఉపయోగించొచ్చు. సోమవారం నుంచి రోజుకు 500 యూనిట్లను తయారు చేస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కేవలం ఫేస్ షీల్డ్‌లను మాత్రమే కాకుండా వెంటిలేటర్లను కూడా తయారు చేయనుంది. ఇప్పటికే వెంటిలేటర్ల తయారీకి సంబంధించి నమూనా కూడా రెడీ అయ్యింది. ఆనంద్ మహీంద్రా ఇప్పటికే వెంటిలేటర్ల తయారీ అంశాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ టీమ్స్ ఇంకా మరో 3 నమూనాలపై పని చేస్తున్నాయి. నిపుణుల సలహాలు, సూచనలమేరకు వీటిల్లో మార్పు చేసి అంతిమంగా వెంటిలేటర్లను తయారు చేస్తారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి ఈ వెంటిలేటర్లను ఉపయోగించనున్నారు. ఇవి చాలా తేలికగా ఉంటాయి. చాలా ఫీచర్లు ఉండొచ్చనే అంచనాలున్నాయి. వీటి రూపకల్పనకు కంపెనీ ఇంజనీరింగ్ టీమ్స్‌కు కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం. లైఫ్ సేవర్ డివైజ్‌ల ధర సాధారణంగా రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే కొత్త వాటి ధర మాత్రం రూ.7,500 ఉండొచ్చు.





Untitled Document
Advertisements