3 గంటల్లో 2.4 లక్షల శ్రీవారి లడ్డూల విక్రయం!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 08:14 PM

3 గంటల్లో 2.4 లక్షల శ్రీవారి లడ్డూల విక్రయం!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు విక్రయించారు. గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో లడ్డూ ప్రసాదం కోసం ఆశగా తరలి వచ్చిన భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరులో సైతం లడ్డూ ప్రసాదాలు విక్రయించనున్నారు. మంగళవారం మరో 2 లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల చొప్పున లడ్డూలు తరలించేందుకు టీటీడీ యోచిస్తోంది. కాగా, సోమవారం నుంచి 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూలు విక్రయిస్తారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టీటీడీ కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333ను సంప్రదించవచ్చు. ఎక్కువ మొత్తంలో లడ్డూలు (1,000కి పైగా) కొనుగోలు చేయాలనుకున్న భక్తులు తమ పేరు, పూర్తి అడ్రస్, మొబైల్‌ నంబర్‌ను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది. లడ్డూల లభ్యతను బట్టి తిరుపతిలోని టీటీడీ లడ్డూ కౌంటర్‌ నుంచి.. సంబంధిత జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల నుంచి లడ్డూలను అందజేస్తారు.






Untitled Document
Advertisements