ఉద్యోగం పోయిందా? అయితే ఈ బిజినెస్ చేయండి!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:35 PM

ఉద్యోగం పోయిందా? అయితే ఈ బిజినెస్ చేయండి!

కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోతున్నారు. ఉద్యోగుల వేతనాల్లో కోతలు పడుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి డబ్బులు సంపాదించే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది.

అదే వ్యాపారం చేయడం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మరో ప్రశ్న. ఏ బిజినెస్ చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు మీకోసం ఒక బిజినెస్ ఐడియా అందిస్తు్న్నాం. అదే హనీ బిజినెస్. ప్రపంచంలో తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న టాప్-5 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2005-06 నుంచి చూస్తే దేశంలో తేనె ఉత్పత్తి ఏకంగా 242 శాతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తేనె ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రూ.500 కోట్లు కేటాయించింది.

ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా తేనె ఉత్పత్తిని ప్రారంభించొచ్చు. అయితే దీని కోసం హనీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హనీ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే.. కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. ఖాదీ గ్రామోద్యోగ్ స్కీమ్ కింద ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. కేవీఐసీ కింద 65 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. అలాగే మీకు 25 శాతం సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే మీరు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం భరిస్తే సరిపోతుంది.

సంవత్సరానికి 20 వేల కిలోల తేనెను ఉత్పత్తి చేయడానికి మీరు ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే.. దీనికి ఖర్చు దాదాపు రూ.24.5 లక్షలు అవుతుంది. ఇక్కడ మీకు రూ.16 లక్షలు రుణం కింద లభిస్తాయి. అలాగే మార్జిన్ మనీ కింద మరో రూ.6.15 లక్షలు పొందొచ్చు. మీరు సొంతంగా రూ.2.35 లక్షలు పెట్టుకుంటే సరిపోతుంది.

మీరు ప్లాంటు ఏర్పాటు చేసి ఏడాదికి 20 వేల కిలోల తేనెను ఉత్పత్తి చేస్తే.. అప్పుడు ఆదాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కేజీ తేనె ధర రూ.250గా ఉందని అనుకుంటే.. అప్పుడు రూ.50 లక్షలు వస్తాయి. ఇందులో 4 శాతం వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే.. సంవత్సరానికి రూ.48 లక్షలు లభిస్తాయి. ఇందులో అన్ని ఖర్చులు తీసేస్తే.. రూ.14 లక్షల వరకు మిగులుతాయి. అంటే మీరు నెలకు రూ.లక్షకు పైగా సంపాదించినట్లు అవుతుంది.





Untitled Document
Advertisements