రాజకీయ నేత కుమారుడితో వివాహం...ఆపై ఇస్లాం స్వీకరించిన యువతి...లవ్ జిహాది!?

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 03:01 PM

చెన్నైకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె.. బంగ్లాదేశ్‌కు చెందిన రాజకీయ నేత కుమారుడ్ని వివాహం చేసుకుని, ఇస్లాం స్వీకరించింది. దీనిని లవ్ జిహాద్‌‌గా అనుమానించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కేసు నమోదుచేసి విచారణ చేపట్టింది. బలవంతంగా మతమార్పిడికి పాల్పడ్డారేమోనని ఆ యువతిని వాట్సాప్ ద్వారా విచారించింది. వీరిద్దరికీ లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని విచారణలో వెల్లడయ్యింది.

బలవంతంగా మతమార్పిడి చేశారనడానికి తగిన ఆధారాలు లభ్యం కాకపోవడంతో దీనిని ‘లవ్ జిహాద్’గా పరిగణించలేమని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. భర్తతో ఆ యువతి సంతోషంగానే ఉందని, తన ఇష్ట ప్రకారమే ఇస్లాం స్వీకరించినట్లు సమాచారం. యువతి తండ్రి చెన్నైలో వ్యాపారం చేస్తుంటారు.

గతేడాది మేలో తన కుమార్తెను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) నేత కుమారుడు లండన్‌ నుంచి ఎత్తుకెళ్లి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది విదేశానికి సంబంధించిన కేసు కావడంతో తమిళనాడు పోలీసులు ఎన్ఐఏకి సమాచారం ఇచ్చారు. దీంతో లవ్ జిహాద్ కేసుగా అనుమానించి దర్యాప్తు చేపట్టారు.

ఈ అంశంపై ఓ ఎన్ఐఏ అధికారి మాట్లాడుతూ.. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లవ్ జిహాద్ కేసుగా అనుమానించమన్నారు. ఆ యువతిని వాట్సాప్‌లో సంప్రదించామని, ఈ సందర్భంగా ఆమె తాను తన ఇష్టం మేరకే ఇస్లాం మతం స్వీకరించానని చెప్పిందన్నారు. వివాహం కూడా చేసుకున్నామని, ఈ విషయంలో ఎవరి బలవంతం లేదని, తాను సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసింది. తమ విచారణ పూర్తయ్యిందని, ఈ నివేదికను కోర్టుకు అందజేస్తామని ఎన్ఐఏ తెలిపింది.

ఈ ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. తన కుమార్తెను అపహరించారని ఆ యువతి తండ్రి గతేడాది తమకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదుచేయడానికి తమకు అధికారం లేకపోవడంతో ఎన్ఐఏకు బదిలీ చేశామని, తదుపరి వివరాలు, ప్రస్తుత విచారణ పరిస్థితి తమకు తెలియదని అన్నారు. లవ్ జిహాద్ కేసులో ఎన్ఐఏ విచారణ ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇటువంటి కేసులను విచారించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళకు చెందిన హదియా-షఫీన్ జెహాన్ వివాహ ఉదంతంపై కూడా దర్యాప్తు చేపట్టింది.





Untitled Document
Advertisements