వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై బీజేపీ ఫోకస్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:45 PM

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై బీజేపీ ఫోకస్

దుబ్బాక ఉపఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఖమ్మం గుమ్మంలో కాషాయ జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్ఎస్ ఎలాగైనా వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఖమ్మంలో టీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీతోపాటు.. తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు పార్టీలో ఉన్నారు.

మరోవైపు బీజేపీకి ఇక్కడ పెద్ద బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆకట్టులేకపోయింది. కానీ ప్రస్తుతం పరిణామాలు మారాయి. బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీ దూకుడు పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంతోపాటు.. టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలకు ఆకర్షణ వల విసిరే ప్రయత్నాల్లో ఉంది.

మంత్రి పువ్వాడ అజయ్‌తో కమలం పార్టీ ఢీకొట్టబోతోంది. ఇప్పటికే గోళ్లపాడు నిర్వాసితుల విషయంలో బీజేపీ వేగంగా స్పందించింది. బీజేపీ ఫిర్యాదు మేరకు జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి ఖమ్మంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ చొరవ చూపినప్పటికీ.. బీజేపీకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నేడు (శుక్రవారం) ఖమ్మంలో పర్యటిస్తోన్న బండి సంజయ్.. భారీ బైక్ ర్యాలీతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

టీఆర్ఎస్ పైకి బలంగా కనిపిస్తున్నప్పటికీ.. అంతర్గత కలహాలు ఆ పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి దక్కింది. మంత్రిగా ఓ వెలుగు వెలిగిన తుమ్మల ఎన్నికల్లో ఓడటంతో.. సైలెంటయ్యారు. మరోవైపు పొంగులేటికి లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో వీరిద్దరూ ఇటీవల బల ప్రదర్శన చేపట్టారు. తమ బలమేంటో అధిష్టానానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు.



ఇటీవల ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పొంగులేటిని వెంటబెట్టుకుని హెలికాప్టర్‌లో తనతోపాటు హైదరాబాద్ తీసుకెళ్లారు. వర్గపోరుతో పార్టీ నష్టపోవద్దనే భావనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. మరి గ్రూపు రాజకీయాలు మానుకొని పార్టీ గెలుపు కోసం నలుగురు కీలక నేతలు పని చేస్తారా లేదా అనేది టీఆర్ఎస్ విజయానికి కీలకం. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పని చేస్తే మాత్రం గులాబీ పార్టీకి ఇబ్బందులు తప్పవు.





Untitled Document
Advertisements