మూడోసారి తండ్రైన దర్శకుడు సెల్వరాఘవన్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:53 PM

మూడోసారి తండ్రైన దర్శకుడు సెల్వరాఘవన్

తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా చేసిన ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య గీతాంజలి గురువారం (జనవరి 7న) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గీతాంజలి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. సెల్వరాఘవన్, గీతాంజలి దంపతులకు ఇది మూడో సంతానం. ఇప్పటికే వాళ్లకు కుమార్తె లీలావతి, కుమారుడు ఓంకార్ ఉన్నారు. ఇప్పుడు మూడో సంతానంగా మళ్లీ మగ బిడ్డకు జన్మనిచ్చారు గీతాంజలి. ఈ బిడ్డకు రిషికేశ్ సెల్వరాఘవన్ అని నామకరణం చేశారు.
రిషికేశ్ సెల్వరాఘవన్‌కు స్వాగతం చెబుతూ గీతాంజలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. తమకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికీ గీతాంజలి ధన్యవాదాలు తెలిపారు. తామిద్దరం క్షేమంగా ఉన్నామని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ మరోసారి తండ్రి కావడంతో తమిళ చిత్ర సీమకు చెందిన పలువురు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, తమిళ స్టార్ హీరో ధనుష్‌ అన్నయ్యే ఈ సెల్వరాఘవన్. గీతాంజలి ఆయనకు రెండో భార్య. ‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను మొదట సెల్వరాఘవన్ పెళ్లాడారు. 2006లో వీరి వివాహం జరిగింది. ఆమెతో రెండేళ్ల కాపురం తరవాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. 2010లో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అనంతరం తన సహాయ దర్శకురాలు గీతాంజలి రామన్‌ను 2011లో సెల్వరాఘవన్ వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో లీలావతి, 2013లో ఓంకార్ జన్మించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే గీతాంజలి.. గతేడాది నవంబర్ నుంచి తన ప్రెగ్నెన్సీ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements