అర్థరాత్రి ఆక్సిజన్ ఆపేసిన ఆస్పత్రి సిబ్బంది...కోవిడ్ రోగి మృతి...వీడియో

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 07:08 PM

అర్థరాత్రి ఆక్సిజన్ ఆపేసిన ఆస్పత్రి సిబ్బంది...కోవిడ్ రోగి మృతి...వీడియో

కోవిడ్-19పై భారత్ పోరాటం ప్రారంభించిన ఏడాది దాటిపోయింది. అయితే, గతం కంటే మహమ్మారి మరింత వేగంగా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో ఐసీయూలు, ఆక్సిజన్ బెడ్‌లు, సాధారణ వార్డులు పూర్తిగా నిండిపోగా.. మహమ్మారికి బలైనవారి మృతదేహాలను భద్రపరచడానికి మార్చురీలు సరిపడటం లేదు. పలు చోట్ల ఆక్సిజన్ కొరత, చికిత్స అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.

అయితే, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోవడం ఒక ఎత్తయితే.. ఆస్పత్రి నిర్లక్ష్యం చేజేతులా ఓ మనిషి ప్రాణాలు తీసింది. ఆక్సిజన్‌ సరఫరాను ఆస్పత్రి సిబ్బంది నిలిపివేయడంతో కోవిడ్ బాధితుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం అక్కడ సీసీటీవీలో రికార్డయ్యింది. ఆక్సిజన్‌ను నిలిపివేయడంతో చనిపోయినట్టు మృతుడి బంధువులు ఆరోపించగా.. దీనిని హాస్పిటల్ యాజమాన్యం తొలుత తోసిపుచ్చింది.

మంగళవారం రాత్రి 11.30 గంటలకు వరకూ మా నాన్నతోనే ఉన్నానని మృతుడి కుమారుడు తెలిపాడు. అనంతరం తాను ఇంటికి వెళ్లిపోగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు బుధవారం ఉదయం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ‘‘గత రెండు మూడు రోజులుగా నాన్న ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది.. ఆహారం తీసుకుంటున్నారు.. కానీ, మంగళవారం రాత్రి ఆక్సిజన్‌ను సిబ్బంది ఆపేశారు.. బుధవారం ఉదయం తనకు ఫోన్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లారు.. మా నాన్నకు ఆక్సిజన్ పెట్టాలని సిబ్బందిని ప్రాధేయపడితే తిరస్కరించారు.. తర్వాత ఐసీయూకి తరలించాను కానీ, 15 నిమిషాల్లోనే ఆయన ప్రాణాలు విడిచారు’’ అని వాపోయాడు. మృతుడికి ఆక్సిజన్‌ను తొలగించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో వృద్ధుడి బెడ్ వద్ద ఓ ఆరోగ్య కార్యకర్త నిలబడి ఉంది.. సహాయం కోసం తన సహచరులను పిలుస్తోంది.. అదే సమయంలో ఆక్సిజన్ సరఫరా అయ్యే బటన్‌ను నొక్కడం కనిపించింది... కోవిడ్ వార్డులలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు సాధారణంగా పీపీఈ కిట్‌ను ధరిస్తారు.. కానీ, అతడు ఆ నిబంధనలు ఏదీ పాటించలేదు.. ఆక్సిజన్ నిలిచిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్టు స్పష్టంగా అందులో రికార్డయ్యింది. ఈ ఆరోపణలను తొలుత తోసిపుచ్చిన ఆస్పత్రి ఉన్నతాధికారులు.. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. సర్జన్ విభాగం చీఫ్ డాక్టర్ అనంత్ కుమార్ రాథోడ్ నేతృత్వంలోని ఈ కమిటీ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అర్జున్ లాల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలో 76 ఆక్సిజన్ బెడ్‌లు, 30 పడకల ఐసీయూ, 13 ఆక్సిజన్ సరఫరా మెషనరీలు ఉన్నాయన్నారు. అవసరానికి సరపడా నిల్వలు కూడా ఉన్నాయని, చనిపోయిన రోగికి డయాలసిస్ చికిత్స కూడా నిర్వహించామని అన్నారు.







Untitled Document
Advertisements