"తెలంగాణలో లాక్ డౌన్ ఉండబోదు"

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 08:00 PM


తెలంగాణలో కరోనా వైరస్ రెండో విడతలో వేగంగా విస్తరిస్తున్న వేళ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉంటుందా? లేదా? అనే అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించే ఆస్కారం ఉండబోదని తేల్చి చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఎక్కువ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అలాగే 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ను కోరామని.. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. కానీ ఆయన ఏ హామీ ఇవ్వలేదని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సెకండ్ వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ఆయన్ని నిరుద్యోగులతో కలిసి ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేకపోతే నిరుద్యోగులకు భృతి అయినా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో వారు మంత్రి కారుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు.





Untitled Document
Advertisements