చేనేత సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : పవన్

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 03:26 PM

చేనేత సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : పవన్

ధర్మవరం, జనవరి 29 : ప్రజాయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఓ అభిమాని "అజ్ఞాతవాసి" చిత్రంతో రూపొందించిన పట్టువస్త్రాన్ని‌ బహూకరించారు. ఆ వస్త్రాన్ని పరిశీలించిన పవన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "చిన్నప్పుడు నేను చీరాలలో పెరిగాను. అక్కడ చేనేత కార్మికులు చాలా ఎక్కువ. నా స్నేహితుల తల్లిదండ్రులు మగ్గం నేయడం నేను చూశాను. అలా చేయడం వల్ల వారికి వెన్నెముక వంగిపోయి, చేతులు ఎంత పగిలిపోయాయో, ఎంత బాధనో అనుభవించారో నేను చూశాను. మగ్గం వేయడం ఎంత కష్టమో నాకు తెలుసు" అన్నారు.

వీటన్నింటి దృష్ట్యా ధర్మవరం చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని, చేనేత కళ అంతరించి పోకుండా చూస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.





Untitled Document
Advertisements